ములకలపల్లి మండలంలో సుడిగాలి పర్యటన.. కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, చెక్కుల పంపిణీ.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) ఫిబ్రవరి, 28: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండలంలో శనివారం అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించి, పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ముఖ్యంగా విద్య, మహిళా సాధికారత, వ్యవసాయం మరియు మత్స్య రంగాలకు పెద్దపీట వేస్తున్నామని ప్రకటించారు. పర్యటనలో భాగంగా పాతగంగారం, చౌటిగూడెం, తిమ్మంపేట, రామాంజనేయపురం మరియు మాదారం గ్రామాల్లో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. విద్యాభివృద్ధిలో భాగంగా పాతగంగారం ప్రైమరీ స్కూల్ కొత్త భవనానికి, టీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలు, పొగళ్లపల్లి మరియు సత్యంపేట హైస్కూళ్ల ప్రహరీ గోడల నిర్మాణానికి పునాదిరాళ్లు వేశారు. జగన్నాధపురం, పొగళ్లపల్లి మరియు ములకలపల్లి రైతు వేదికల వద్ద లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడంతో పాటు, మూకమామిడి గ్రామసభలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాల పెంపు కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపల పెంపకం యూనిట్ను, మండల కేంద్రంలో పౌల్ట్రీ షెడ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు, మండల అధికారులు, బత్తుల అంజి, కారం సుధీర్, స్థానిక సర్పంచులు, ఉపసర్పంచులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








