గన్నులే కాదు పెన్నులూ ప్రమాదమే..!
ఎడిటోరియల్
గన్నులే కాదు పెన్నులూ ప్రమాదమే..!
Not only guns but also pens are dangerous..!
Not only guns but also pens dangerous : అర్బన్ నక్సల్స్ పేరుతో మరింత నిర్భందం పేరిగే అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం గురించో హక్కుల గురించో, రాజ్యాంగం గురించో, సమానత్వం గురించో మాట్లాడినా రాసినా, ప్రశ్నించినా “అర్బన్ నక్సల్స్” పేరుతో అణిచివేత తప్పదనే హెచ్చరికలు చాలా స్పష్టంగా జారీ అవుతున్నాయి. “గన్నులే కాదు పెన్నులు” కూడా ప్రమాదంగానే భావించే పరిస్థితి ఏర్పడింది. అందుకే పెన్నులు పట్టుకున్నవారిని, రాజ్యాంగ హక్కుల గురించి మాట్లాడే వారిని, ప్రజాస్వామిక వాదులను, రచయితలను, జర్నలిస్టులను, ప్రజాసంఘాల అభ్యూదయవాదులను భయం వైపు నెట్టేస్తున్నారు. “అభ్యూదయ ఆలోచనలు చేశారో అర్బన్ నక్సల్స్ అయిపోతారు. “ఉపా” లాంటి కేసులు, జైళ్లు తప్పదు “అంటూ భావాలను సైతం హత్య చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా దేశరాజధాని ఢీల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గతంకంటే దూకుడుగా ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టుల ఏరివేత పెరిగిన విషయం కాదనలేం. ఈ నేపథ్యంలోనే మావోయిస్టుల కోసం తీసుకువస్తున్న అన్ని నిర్బంధ చట్టాలను “అర్బన్ నక్సల్స్” ముద్రతో ప్రజాస్వామిక వాదులను కట్టడిచేసేందుకు ప్రయోగిస్తున్నారు. “అర్బన్ నక్సల్స్” అని ముద్ర వేయడం వలన ప్రజలు, ఈ దేశం ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యలపై చర్చ లేకుండా నివారించడానికి అనుకూలమైన మార్గంగా రాజ్యం ఎంచుకుంటుంది.
Not only guns but also pens dangerous
అందుకే ముందే చెప్పినట్టుగా ప్రజాస్వామ్యం గురించో, రాజ్యాంగ హక్కుల గురించో సత్యం గురించో ఏమాత్రం ఆలోచించకుండా ఈ అర్బన్ నక్సల్స్ పేరుతో కట్టడి చేస్తున్నారు. దీనిలో భాగంగా సమాజంలో ఏ ప్రజాస్వామిక గొంతు కూడా వినకూడదని పకడ్బందీగా అమలవుతున్న నిర్బంధంలో భాగమే కొనసాగుతున్న ఈ “అర్బన్ నక్సల్” ప్రక్రియ. ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయాలు చాలా అవసరం. కానీ అలాంటి భిన్నాభిప్రాయాలు లేని రాజ్యం కావాలని కోరుకునే వారికి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, హక్కులు అంటే ఎలా రుచిస్తుంది..? ఏం తినాలో, ఏ గుడ్డలు వేసుకోవాలో, ఏ సాహిత్యం చదవాలో, ఏం ఆలోచించాలో కూడా రిమోట్ చేయబడుతున్నప్పుడు ఇక సత్యం వైపు నిలబడే వారికి మరింత క్లిష్టమైన పరిస్థితులు తప్పవు. అందుకే సత్యాన్ని అన్వేషించే భావాలు “అర్బన్ నక్సల్స్” ముద్ర వేయబడుతున్నాయి. ఇది చిన్న విషయం కాదు. ఇది రాజ్యానికి, వ్యక్తికి, రాజ్యానికి భావజాలానికి మధ్య జరిగే ఒక యుద్ధం. ఇది చాలా పెద్ద యుద్ధం. పెద్ద సమస్య కూడా. ఒకరకంగా నా దృష్టిలో ఇప్పుడు పోలీసు బలగాలకు, మావోయిస్టులకు జరుగుతున్న యుద్దం ఒకరకమైన యుద్ధం అయితే. దానికి భిన్నమైన దానికంటే కంటే పెద్ద సమస్య. పెద్ద యుద్ధం. అర్బన్ నక్సల్స్ ముద్ర పేరుతో ఈ సమాజంలో ఒంటరి చేసినప్పుడు దానిని ఎదుర్కోవడం ఒక యుద్దమే. అది తుపాకులతో చేసే యుద్ధం కంటే కొంచెం భిన్నంగానే ఉంటుందనేది నా అభిప్రాయం.
Not only guns but also pens dangerous
అయితే ఇక్కడే మేధావులకు గుర్తింపు పొందిన వ్యక్తులకు కూడా ప్రశ్న ఏర్పడుతుంది. అవసరం అనుకున్నప్పుడు ఎంతటి వారపైనైనా అర్బన్ నక్సల్స్ ముద్ర వేయడానికి పాలకులు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితుల్లో మేధావుల స్పందనలో సహాజంగానే తేడాలుంటున్నాయి. గుర్తింపు పొందిన వ్యక్తి, మేధావిగా పేరున్న వ్యక్తి, సామాజికంగా రాజకీయంగా పరపతి కలిగిన వ్యక్తి అయితే ఒకరకంగా, అలాంటి బ్యాగ్రౌండ్ లేని వ్యక్తి అయితే సమాజం స్పందన ఒకరకంగా ఉంటుందనే కామెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే సహజంగానే ఒక ఆదివాసిపైనా, లేదా ఒక దళిత, గిరిజనులపైనా, నాలాంటి ఒక సాదారణ జర్నలిస్టు పైనా ( నేను “ఉపా” బాధితున్ని ) UAPA (ఉపా ) ప్రయోగించబడితే సమాజం స్పందనలో చాలా తేడాలుంటాయి. మాబోటివాళ్లకు ఏమో మావోయిస్టులతో సంబందాలు ఉండొచ్చునేమో అనే అనుమానాలతో వ్యవహరిస్తుంటారు. ( బహిరంగంగా వ్యక్తపరుచకపోయినా వారి వ్యవహార శైలిలో సహజంగానే బయటపడుతుంటుంది) నిత్యం అభ్యూదయం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, హక్కుల గురించి మాట్లాడే వారు సైతం “ఉపా” బాధితులను చూసే దృష్టి కోణం మారుతుంటుంది. ఇలాంటి “ఉపా” బాధితుల గురించి మేధావులు నోరువిప్పకుంటే ఇంకెవరు మాట్లాడుతారు..?. అసలు “ఉపా” కేసులు అంటేనే తెలియని అమాయకులపై కూడా (ఆదివాసీలు) మావోయిస్టులతో సంబందాలు ఉన్నాయనే పేరుతో ఖైదీ చేస్తున్నారు. నేను ఇదే “ఉపా” కేసులో 96 రోజులు ఖమ్మం జైల్లో ఉన్నాను. అక్కడ అసలు ములాఖాత్ కూడా ఎలా పెట్టాలో తెలియని ఆదివాసీలపై ఉపా కేసులు పెట్టి జైల్లో పెట్టారు. అప్పటికే వారు సుమారు 18నెలలుగా ఆ జైల్లో ఉంటున్నారు. ఒక్కొక్కరిమీద పదుల సంఖ్యలో కేసులున్నాయని తెలిసింది. ఇది 2021 సంగతి. ఇలాంటి వారి గురించి మాట్లాడే శాతం తగ్గింది. ఈ స్థితి మారాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మేధావి వర్గం అసలే స్పందించడం లేదనేది నా ఉద్దేశ్యం కాదు. ఆ స్పందన విస్తృతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. అక్కడ ఇంకో సమస్య కూడా ముందుకు వస్తుంది. “ఉపా” లాంటి నిర్భంద చట్టాలు కలిగించే భయం. భయం అనేది మనిషి స్పందనను కూడా కట్టడి చేస్తుంటుంది. ఆ మేరకు పౌర సమాజ స్పందన కూడా గిరి గీసుకుంటుంది. ఇది సామాన్యులకే కాదు మేదావుల్లోనూ ఆయా భయం కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు అనుకోకతప్పదు. ఎర్రజెండా పార్టీల్లోనూ ఈ ఆనవాళ్లకు కొదువుండదు. ప్రజాస్వామిక వాదులు, ఎర్రజెండా పార్టీలు, దళిత, గిరిజన, ఆదివాసీ సంఘాలు, మేదావులు, జర్నలిస్టులు, న్యాయవాదులు, హక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు అక్రమ కుట్ర కేసులైన “ఉపా” కేసులను రద్దు చేయడమే కాదు “ఉపా” శాశ్వత రద్దు కోసం ఐక్యంగా ముందుకు సాగాల్సిన అవసరం గతంకంటే ఇప్పుడు ఏంతో ఉంది. అది రేపు ఎవరినైనా తాకొచ్చు….
రాజేందర్ దామెర (దారా)
సీనియర్ జర్నలిస్ట్ – వరంగల్
rajenderdamera@gmail.com