రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 10:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి గ్రామ శివారులో వెలసిన శ్రీ పెద్దమ్మ దేవాలయం మూడు రోజులపాటు జరిగే జాతర ఉత్సవాలకు ముస్తాబయింది.రేపటి ఆదివారం రోజు నుండి శ్రీ పెద్దమ్మ జాతర 8వ వార్షికోత్సవ జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.ఉదయం 8 గంటలకు పుణ్యాహవచనము, రక్షాబంధనం,అఖండ దీపారాధన, గణపతి పూజ,నవగ్రహ మండప తీర్థ ప్రసాద కార్యక్రమాలు జరుగుతాయని గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు తెలిపారు.అదేవిధంగా సాయంత్రం 5 గంటలకు గ్రామ దేవతలకు బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.సోమవారం రోజు ఉదయం 8 గంటలకు హోమం,ఉదయం 11 గంటలకు శ్రీ పెద్దమ్మ-పెద్దిరాజుల కళ్యాణం, మధ్యాహ్నం 1 గంటలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహిస్తున్నట్టు,సాయంత్రం 5 గంటలకు పెద్దమ్మ బోనాలు ఊరేగింపు,ఒగ్గు కథ ఉంటుందని పేర్కొన్నారు.మంగళవారం రోజు ఉదయం 8 గంటలకు ఒగ్గు కథ,అమ్మవారికి పంచామృత అభిషేకం,తీర్థ ప్రసాద కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు బండ్ల ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని ఈ జాతర ఉత్సవాలకు శ్రీ గురుమదనానంద సరస్వతి పీఠాధీశ్వరులు, పరమహంస పరివ్రాజాకచార్య, మరియు శ్రీ మదనానంద సరస్వతి స్వామి హాజరవుతున్నట్టు తెలిపారు.ఇట్టి జాతరకు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పెద్దమ్మ జాతర ఉత్సవాలను విజయవంతం చేయాలని వారు తెలియపరచారు.









