* గవర్నర్ దత్తత తీసుకున్న గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లు
* భూభారతి అమలుపై వివరణ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మతో రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం అమలు, మరియు ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి సవివరంగా వివరించారు. ఈ ఏడాది ప్రతినియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల ఇండ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు.
* గవర్నర్ ఆలోచన, ముఖ్యమంత్రి సూచనల మేరకు గిరిజన నియోజకవర్గాలకు అదనంగా 500 నుంచి 700 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, ఐటీడీఏ పరిధిలో చెంచు కుటుంబాలకు పదివేల ఇండ్లను మంజూరు చేస్తున్నామని, మొదటి దశలో అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యతాక్రమంలో కేటాయిస్తామని వివరించారు.
* గవర్నర్ దత్తత తీసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పూసుకుంట, గోగులపూడి గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లా భుర్కి, మంగ్లీ , నాగర్ కర్నూల్ జిల్లా అప్పాపూర్ , బౌరాపూర్ గ్రామాల్లో కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు.
* రాష్ట్రంలో గత పదేళ్లుగా నెలకొన్న భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న లక్ష్యంతో తీసుకువచ్చిన భూభారతి చట్టాన్ని గత నెల 17వ తేదీ నుంచి రాష్ట్రంలోని నాలుగు మండలాల్లో ప్రయోగాత్మకంగా
అమలు చేశామని, ఈనెల 5వ తేదీ నుంచి 28 మండలాల్లో అమలు చేస్తున్నామని వివరించారు. ఎలాంటి రుసుము లేకుండానే ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. గవర్నర్ గారిని కలిసిన వారిలో ఐడీసీ చైర్మన్ మువ్వా విజయబాబు, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ.గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.









