★ వాహన దారులకు ఇక్కట్లు
★పోలీసు ,పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవాలి
పినపాక, సెప్టెంబర్ 16:
ఆ హోటల్ నిర్వాహకుడి ఇష్టారాజ్యం… ఆడిందే ఆట పాడిందే పాటలా ఉంది. తనకు అడ్డు ఎవరూ లేరన్నట్టుగా డ్రైనేజీ ని ఆక్రమించుకుని హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు లాగా సాగుతున్న… వాహనదారులు, పాదాచారులు అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ నాకేమీ పట్టదు అన్నట్లుగా హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. అక్రమంగా ప్రభుత్వ డ్రైనేజీ ఆక్రమించి హోటల్ వ్యవహారం నిర్వహిస్తున్న అక్రమార్కుని పై ప్రజా జ్యోతి కథనం…
పినపాక మండలం… ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఓ హోటల్ నిర్వాకుడు ప్రభుత్వ డ్రైనేజీని అక్రమంగా ఆక్రమించి గత కొన్ని సంవత్సరాలుగా హోటల్ నిర్వహిస్తున్నాడు. పంచాయతీ సిబ్బందికి డ్రైనేజీ శుభ్రం చేయడం ఇబ్బందిగా మారింది. దీనితో అక్కడ దుర్వాసన రావడం జరుగుతుందని పలువురు కస్టమర్లు వాపోయారు. అలాగే హోటల్ ఎదురుగా వాహనాలు పార్కింగ్ చేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అలాగే ఎక్కడ ప్రమాదాలు చోటు చేసుకుంటాయోనని ప్రధాన రహదారిపై వెళ్లే వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంతా జరుగుతున్న పంచాయతీ ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా పోలీసు, పంచాయతీ, ఆర్ అండ్ బి అధికారులు దృష్టి సారించి అక్రమంగా డ్రైనేజీ ఆక్రమించిన హోటల్ నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఎంపీఓ వెంకటేశ్వరరావు వివరణ: డ్రైనేజీ ఆక్రమణ విషయమై ఎంపీఓ వెంకటేశ్వరరావును ప్రజా జ్యోతి వివరణ కోరింది. డ్రైనేజీ ఆక్రమణ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.









