నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
తిరుమలాయపాలెం : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమలాయపాలెం గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో “స్వస్త్ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమాన్ని ప్రారంభించి, అనంతరం అదే ఆవరణలో 21 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
తదనంతరం రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలాయపాలెం నుండి ములకలపల్లి బ్రిడ్జి వరకు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ…. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “ఆడబిడ్డకు అన్ని విధాలా అండదండలుగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తోంది. మహిళల ఆరోగ్య రక్షణకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది” అని పేర్కొన్నారు.
మారుమూల ప్రాంతాల్లో కూడా విద్యా, వైద్య రంగాలకు ఇందిరమ్మ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, పూర్వ ప్రభుత్వాలు ఈ రంగాలను విస్మరించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. పేదలకు వైద్యం ఎక్కడా ఇబ్బంది లేకుండా డాక్టర్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. కేంద్రం మహిళల ఆరోగ్య భద్రత కోసం 15 రోజులపాటు మాత్రమే కార్యక్రమాలు చేపడుతుంటే, ఈ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు మహిళల ఆరోగ్య ప్రయోజనాల కోసం కృషి చేస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
అనంతరం కొక్కిరేణి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సిరిగద్దె ఉపేందర్ తల్లిదండ్రులు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. చిత్ర పటాలకు పూలు వేసి నివాళులు అర్పించారు.









