నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్ 17: అశ్వారావుపేట మండలంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న సమ్మెకు అశ్వారావుపేట బీఆర్ఎస్ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డైలీ వేజ్ వర్కర్లకు ₹26,400 వేతనం చెల్లించేవారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కనీస వేతనాన్ని ₹11,000 కు తగ్గించడం చాలా దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు సమ్మె మొదలుపెట్టి ఆరు రోజులు అవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామని చెబుతున్న ప్రభుత్వం, పిల్లలకు అన్నం పెట్టే కార్మికులు సమ్మెలో ఉంటే, భోజనం ఎలా పెడతారో ఆలోచించలేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వారు విమర్శించారు. రైతులు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, నాయకులు కేవలం ఫోటోలకు పోజులివ్వడానికి మాత్రమే సరిపోతున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే ప్రభుత్వం డైలీ వేజ్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి, జీవో నం.64ను ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి యూఎస్ ప్రకాష్ రావు, మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, బరగడ కృష్ణ, నియోజకవర్గ నాయకురాలు వగ్గేల పూజ, మండల నాయకులు మందపాటి రాజా మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ నారం రాజశేఖర్, అశ్వారావుపేట టౌన్ పార్టీ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, జుజ్జురపు శ్రీరామమూర్తి, ఈదర రాంబాబు, మాజీ ఎంపీటీసీ పద్దం శ్రీను, మాలోతు రామారావు, నవీన్, హరికృష్ణ, అమీర్, వేజ్ వర్కర్లు జెట్టి వేంకటేశ్వర రావు, జెట్టి సత్యం, మాడివి వేంకటేశ్వర రావు, భూక్యా లక్ష్మీ, కారం బద్రమ్మ, తోట సీత, బుగ్గ రాంభాయ్, వెట్టి మంగ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









