నేటి గదర్ న్యూస్, వైరా:-
రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు మరియు హాస్టళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కార్మికులు గత పది రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మరియు గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికీ స్పందించకపోవడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా వీరభద్రం అన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ వెంటనే చర్చలు జరిపి కార్మికుల డిమాండ్లను పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కనీస వేతన చట్టం అమలు చేయకపోగా, ఇప్పటికే ఇస్తున్న వేతనాలను తగ్గించి శ్రమదోపిడీకి పాల్పడటం అమానవీయమని విమర్శించారు.
కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కార్మికులుగా పనిచేస్తున్న వారందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు, సమ్మె చేస్తున్న కార్మికులకు తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
ప్రభుత్వం సమ్మె పట్ల తక్షణమే స్పందించకపోతే వైరా నియోజకవర్గంలోని కారేపల్లి, ఏన్కూరు, కొణిజర్ల, కామేపల్లి మండలాలతో పాటు మొత్తం జిల్లావ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలో, గిరిజన హాస్టల్ వద్ద జరుగుతున్న సమ్మె శిబిరాలను సందర్శించి కార్మికులను సమీకరించి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అధికార పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు కూడా వెంటనే జోక్యం చేసుకొని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన కోరారు.









