గంజాయి రవాణాలో పట్టుబడితే ఆస్తులు జప్తు
– సహకరించిన వారిపై సైతం కేసులు తప్పవు
– ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు
ప్రభుత్వ నిషేధిత గంజాయిని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారిని జైలుకు పంపించడమే కాకుండా వారి యొక్క ఆస్తులను కూడా జప్తు చేయడం జరుగుతుందని ఈ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు తెలియజేశారు. శనివారం రాత్రి ఆయన ఈ బయ్యారం పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు తెలిపారు. ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్లో నమోదైన గంజాయి రవాణా క్రైమ్ కేసు నెంబర్. 78/2024 కేసులో ముద్దాయిల తోపాటు బంధువుల యొక్క ఆస్తులను ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా వారి పేరు మీద ఉన్న ఆస్తులను కూడా ఫ్రీజింగ్ చేయడం జరిగిందని తెలిపారు.వారి బంధువుల ట్రాక్టర్,కారు, ఆటో, నాలుగు మోటార్ సైకిల్ లు , మూడు గృహాలను గుర్తించి చెన్నై కాంపిటెంట్ అథారిటీ వారికి పంపగా వాటిలో నుంచి ఒక ట్రాక్టర్,ఒక కారు,ఒక ఆటో, నాలుగు మోటార్ సైకిల్లకు సంబంధించి ఫ్రీజింగ్ ఆర్డర్ తీసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో ముద్దాయిలయిన నలుగురికి సంబంధించిన ఆస్తులను , వారి బంధువుల ఆస్తులను ఫ్రీజింగ్ చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణా, సరఫరా, అమ్మడం ,కొనడం చేస్తూ పట్టుబడిన, వారిని జైలుకు పంపించడమే కాక, తర్వాత గంజాయి ద్వారా సంపాదించిన వారి ఆస్తులను జప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.









