నీళ్ల కోసం రోడ్డెక్కిన ఊట్లపల్లి గ్రామస్తులు: ‘కేసీఆర్ ప్రభుత్వంలో ఈ బాధ లేదు’ అంటూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు
డ్రైనేజీ సమస్యలు, పైప్లైన్ లీకులు పట్టించుకోవట్లేదని ఆవేదన; ‘పన్నుల వసూలుకు టైముంటుంది, రిపేర్లకు ఉండదా?’ అని ఆగ్రహం
నేటి గద్దర్ న్యూస్, అశ్వరావుపేట, అక్టోబర్, 01: నీటి సమస్యపై తీవ్ర ఆగ్రహంతో అశ్వారావుపేట మండలం, ఊట్లపల్లి గ్రామస్తులు బిందెలతో రోడ్డు ఎక్కారు. తాము పనులు మానుకొని నీళ్ల కోసం ఇబ్బందులు పడుతున్నామని, తమ సమస్యలను పంచాయతీ సిబ్బంది, కార్యదర్శి పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. కూలి పనులకు వెళ్లే తాము ఉదయాన్నే నీళ్ల కోసం చాలా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. “ఇంటి పన్నుల మీద డబ్బులు వసూలు చేయటానికి మాత్రమే ఖాళీ ఉంటుంది. కానీ, నీళ్ల పైపులు ఖరాబైతే బాగు చేయాలనే ఉద్దేశం లేదా?” అని వారు పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. గ్రామంలో డ్రైనేజీ కాలువల్లో బ్రీజింగ్ (పూడిక తీయడం) లేకపోవడం వల్ల జ్వరాలు వస్తున్నాయని ఎన్నిసార్లు పంచాయతీ సిబ్బందితో చెప్పినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. “పంచాయతీ సెక్రటరీతో మాట్లాడితే చెవుటోడి ముందు శంఖం ఊదినట్టేగాని, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు” అని మండిపడ్డారు. దీనికి తోడు ఇప్పుడు నీళ్ల పైపులు పగిలి నీళ్లు లేకపోయినా తమ బాధ తీర్చేవారు ఎవరూ లేరని, అందుకే ఆడవాళ్లందరం బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కామని చెప్పారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు తాము రోడ్డు మీద బిందెలతో నిలబడలేదని గ్రామస్తులు గుర్తు చేశారు. “ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మేము ప్రతి దానికి బాధపడుతున్నామని, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరని” గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు తక్షణమే స్పందించి తాగునీరు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.









