నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
గ్రామ రాజకీయాలను శాసించే స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ముఖ్యమైనవని,ఇవి నాయకులకు ఆక్సిజన్ వంటివని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.ఎన్నికలు ఎప్పుడు జరిగినా,ఏ రూపంలో వచ్చినా కూడా బీఆర్ఎస్ సిద్ధమేనని, విజయఢంకా మోగించడం తథ్యమన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఖమ్మంలో బుధవారం సప్తపది ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు అధ్యక్షతన సన్నాహాక సమావేశం జరిగింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,22 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడి రాష్ట్రం 10 ఏండ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చాక,మన నాయకులు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక గొప్పగా చక్కదిద్దుతారన్నారు. కాంగ్రెస్ నాయకులు అలవికాని 432 హామీలిచ్చి,వాటిని అమలు చేయకుండా,ప్రతిపక్ష నాయకులు,పాత్రికేయులపై అక్రమంగా కేసులు పెడుతూ “డైవర్షన్ పాలిటిక్స్”కు పాల్పడుతున్నారని ఎంపీ రవిచంద్ర తూర్పారబట్టారు.ప్రజలు ఛీత్కరించుకుంటుండడంతో దిక్కుతోచని పాలకులు తమలో తాము గొడవలు పెట్టుకుంటూ మరింత పల్చనవుతున్నారని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు.అధికార పక్షం నాయకుల ప్రోద్బలంతో కేసులు బనాయిస్తున్నా భయపడవద్దని,ఖమ్మం జిల్లా పోరాటాల ఖిల్లా అని,మన నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై కూడా కేసులు పెట్టడం జరిగిందన్నారు.సీనియర్ జర్నలిస్టు సాంబశివరావుపై కేసు పెడితే పాత్రికేయులందరూ ఐకమత్యాన్ని చాటి చెప్పి ఆయనకు బాసటగా నిలిచారని ఎంపీ వద్దిరాజు గుర్తు చేశారు.అదే సంఘటిత శక్తిని మనమందరం కూడా ప్రదర్శిస్తూ సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.ఇటీవల అధికార పార్టీ నుంచి రాష్ట్రమంతటా కూడా బీఆర్ఎస్ లోకి బాగా వలసలు పెరిగిపోయాయని,ఒక నెల రోజులు మనమందరం కష్టపడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించడం ఖాయమన్నారు.పంచాయతీ ఎన్నికలలో పట్టణాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు,ఆ తర్వాత జరిగే మునిసిపల్ ఎన్నికలలో గ్రామాల నాయకులు పరస్పర సహకారం,సమన్వయంతో పని చేయడం ద్వారా ఘన విజయాలు నమోదు చేద్దామని ఎంపీ రవిచంద్ర చెప్పారు.తద్వారా ఖమ్మం జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చేయడంతో పాటు రాష్ట్రంలో పెనుమార్పునకు బాటవేద్దామని,2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చి కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామని ఎంపీ వద్దిరాజు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ ఉపేందర్ రెడ్డి,బానోతు చంద్రావతి,జేడ్పీ మాజీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్,పార్టీ నాయకులు ఉప్పల వెంకటరమణ, బమ్మెర రాంమూర్తి, పగడాల నాగరాజు,తిరుమలరావు,బెల్లం వేణుగోపాల్,బానోతు మంజుల,కట్టా అజయ్ కుమార్, గిరిబాబు,కట్టా కృష్ణార్జునరావు తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”వర్థిల్లాలి వర్థిల్లాలి బీఆర్ఎస్ వర్థిల్లాలి”,”జిందాబాద్ జిందాబాద్ కేసీఆర్ జిందాబాద్”అంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు.









