వాగ్దానాలు వదిలి మాయలో పడేసిన కాంగ్రెస్ను చిత్తుగా ఓడించండి -అశ్వారావుపేటలో టీడీపీ పిలుపు
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్ 08: ఎన్నికల్లో ఆరు గ్యారంటీలు పేరుతో అధికారంలోకి వచ్చి, వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ కట్రం స్వామిదొర మరియు మండల అధ్యక్షుడు నార్లపాటి శ్రీను ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయకపురం గ్రామంలో బ్రహ్మేంద్ర అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం మండల కమిటీ ఎన్నికల సన్నాహక విస్తృత సమావేశంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసగించిందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయకుండా ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారని అన్నారు. పరిపాలనలో వైఫల్యం, అబద్ధపు ప్రచారం కారణంగా ఒక్క సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందని విమర్శించారు. ఆరు గ్యారంటీలలో 90 శాతం అమలు చేశామని కాంగ్రెస్ చెప్పుకోవడం కేవలం అబద్ధపు ప్రచారం మాత్రమే. ప్రజల జీవితాల్లో మార్పు ఏమాత్రం కనిపించడం లేదు అని వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని వక్తలు పేర్కొన్నారు. మండలంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచు, వార్డ్ సభ్యులుగా తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ఈ సందర్భంగా తిరుమలకుంట, నందిపాడు, వినాయకపురం, కావడిగుండ్ల గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలిపారు. త్వరలోనే మండలంలోని మిగతా సర్పంచులు, ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో మండల నాయకులు ఉప్పల నాగప్రసాద్, సంఘం మధు, ఆళ్ల రమేష్, వినాయకపురం గ్రామ కమిటీ ప్రతినిధులు మరియు మండలంలోని వివిధ గ్రామాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









