ఉద్యాన కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వర్మికంపోస్టింగ్ కార్యక్రమం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 14: మండల పరిధిలోని నారంవారిగూడెం గ్రామంలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల విద్యార్థులు మంగళవారం రైతులకు వర్మికంపోస్టింగ్ (వానపాముల ఎరువు తయారీ)పై అవగాహన కల్పించారు. ఉద్యాన కళాశాల మెజర్ల విద్యార్థులు రూరల్ హార్టికల్చర్ వర్క్ ఎక్స్పీరియన్స్ కార్యక్రమం లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రైతులకు వర్మికంపోస్టింగ్ ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు మాట్లాడుతూ ఉద్యాన పంటలలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలు మరియు చెత్తను బయట పారవేయకుండా, వాటిని ఉపయోగించి అధిక నాణ్యత గల వానపాముల ఎరువును (వర్మికంపోస్ట్) తయారు చేసుకునే విధానాన్ని రైతులకు ప్రయోగపూర్వకంగా చూపించారు. దీని వలన పంటలకు రసాయన ఎరువుల వాడకం తగ్గి, భూమి ఆరోగ్యం మెరుగుపడుతుందని, పండించిన ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుందని వివరించారు. ఈ విధంగా సొంతంగా ఎరువులు తయారు చేసుకోవడం వలన రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గుతాయని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు కృష్ణ నాయక్, వంశీ, నగేష్, ధర్మతేజ, సురేంద్రలతో పాటు గ్రామ సెక్రటరీ రమేష్ మరియు నారంవారిగూడెం రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు.









