లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలి -ఆదివాసీ సంఘాల డిమాండ్
ఏజెన్సీ హక్కులు, 1/70 చట్టం లంబాడీలకు వర్తించకూడదు; గిరిజనులపై దాడులు, అక్రమ కేసుల నిలుపుదలకు డిమాండ్; ప్రభుత్వం తక్షణమే స్పందించాలని హెచ్చరిక
అశ్వారావుపేటలో నూతన ఉత్తేజంతో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్ 22: ఏజెన్సీ ప్రాంతంలో లంబాడీలకు ఏజెన్సీ హక్కులు ఇవ్వరాదని, వెంటనే వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేశాయి. గిరిజనుల మీద దాడులు అక్రమ కేసులను నిలుపుదల చేయాలని, కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ డిమాండ్ల సాధన కోసం నూతన ఉత్తేజంతో మహిళలు సహా అంతా ప్రత్యక్ష కార్యచరణకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. మంగళవారం అశ్వారావుపేట మండలంలోని స్థానిక గిరిజన భవనం (సోయం గంగులు ప్రాంగణం) లో నియోజకవర్గ స్థాయి ఆదివాసీ విద్యార్థి, ఉద్యోగ, మహిళా, జనరల్ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఆదివాసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఊకె రవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని మండలాలకు చెందిన జనరల్ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనేక సమస్యలపై చర్చించి, తదుపరి ప్రత్యక్ష ఉద్యమ కార్యాచరణను అమలు చేయడానికి రౌండ్ టేబుల్ సమావేశంలో పలు కీలక విషయాలను ఆమోదించారు. కీలక డిమాండ్లు లంబాడీలకు ఏజెన్సీ హక్కులు ఇవ్వరాదు, షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న లంబాడా కమ్యూనిటీకి తక్షణమే ఏజెన్సీ హక్కులు ఇవ్వకూడదని, 1/70 చట్టం, పీసా, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ తదితర చట్టాలు కూడా వారికి వర్తించకూడదని ఆదివాసీ నాయకులు స్పష్టం చేశారు. 1950లో గుర్తించిన ఆదివాసీలకు మాత్రమే ఏజెన్సీ ప్రాంతం దక్కాలని, 1976లో ఎస్టీ జాబితాలో కలిపిన లంబాడీలకు 1950 చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఏజెన్సీ హక్కులు షెడ్యూల్ ప్రాంత వాసులకు మాత్రమే దక్కే విధంగా చేయాలని, దీనిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో గ్రామస్థాయిలో ఉద్యమ కార్యాచరణకు పూనుకుంటున్నామని తెలిపారు. దాడులు, అక్రమ కేసులు నిలుపుదల చేయాలి, నియోజకవర్గ వ్యాప్తంగా ఆదివాసీల మీద జరుగుతున్న దాడులను వెంటనే నిలుపుదల చేయాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడతామని హెచ్చరించారు. చట్ట ప్రకారం పనిచేయాలి: ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ ప్రభావంతో ప్రభుత్వ అధికారులు చట్టప్రకారంగా పనిచేయడం లేదని, రాజ్యాంగంపై ప్రమాణం చేసి వచ్చి రాజకీయ నాయకులు చెబితే పనిచేసే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు ఎలాంటి ఒత్తిడిలకు తావు లేకుండా, చట్ట ప్రకారం పేద ఆదివాసీల కోసం పనిచేయాలని కోరారు. తప్పుడు కేసులపై ఆగ్రహం: ఏజెన్సీ ప్రాంతంలో భూముల విషయంలో పోలీసులు ఒక వర్గం వారికి మాత్రమే సహకరిస్తూ, చట్టబద్ధత లేకున్నా అమాయక ఆదివాసీల మీద తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని నాయకులు మండిపడ్డారు. చట్ట విరుద్ధంగా పనిచేసిన ఏ ఒక్క అధికారిని, రాజకీయ నాయకుడిని తదుపరి ప్రత్యక్ష ఉద్యమంలో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలి: అనేక కోర్టులు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, వాటిని అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం ఉద్దేశం చూపకపోవడం దురదృష్టకరమని, ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని వారు డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జ్తో విచారణ: షెడ్యూల్ ప్రాంత సమస్యలపై సిట్టింగ్ జడ్జ్తో విచారణ జరిపించాలని, పెద్ద ఎత్తున జరిగిన అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కార్యచరణ వివరాలు: ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐదు మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, తదుపరి ప్రత్యక్ష కార్యాచరణకు సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. ఐదు మండలాలకు సంబంధించిన సమస్యలను నివేదిక రూపంలో తయారుచేసి, గ్రామస్థాయిలో, మండల స్థాయిలో చైతన్య సదస్సులు నిర్వహిస్తామని అన్నారు. ఏజెన్సీ ప్రాంత భూముల ఆక్రమణ, ఉద్యోగ రిజర్వేషన్లు, పెదవాగు ప్రాజెక్టు, నాన్-ఏజెన్సీ కేసులు, షెడ్యూల్ ప్రాంత చట్టాల అమలు తదితర అనేక విషయాలపై సమావేశంలో చర్చించారు. పాల్గొన్న నాయకులు: ఈ కార్యక్రమంలో ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కురసం రామారావు, మహిళా నాయకులు రాలు సరోజిని, వెంకటరమణ, ఆదివాసీ ఆదిమ తెగల సంఘం నాయకులు సోయం కన్నరాజు, ఆదివాసీ నాయక్ పోడు సేవా సంఘం నాయకులు తాళ్ల దుర్గయ్య, ఆదివాసీ అంగన్వాడి యూనియన్ సంఘం నుండి వగ్గల సరోజిని, వెంకటరమణ, లక్ష్మీ, తుడుం దెబ్బ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దారబోయిన రమేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి, దమ్మపేట మండల అధ్యక్షులు సున్నం శ్రీనివాస్, ఆదివాసీ సేన నాయకులు, ఇతర సంఘాల నాయకులు మొత్తం 18 సంఘాల నుంచి జేఏసీలో పాల్గొని తీర్మానాలు చేశారు.









