నేటి గదర్ న్యూస్, వైరా:
మార్పు స్వచ్చంధ సంస్థ ఆధ్వర్యంలో వైరా మండలం పాలడుగు గ్రామానికి చెందిన ప్రజానాట్యమండలి కళాకారుడు మోదుగు గోవిందరావుకు 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మోదుగు గోవిందరావుకు ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి ఎడమ చేయి మూడు చోట్ల విరిగింది. ఆపరేషన్ చేసి రాడ్లు వెసినారు. మోదుగు గోవిందరావు అమ్మ మోదుగు శుక్కమ్మ అనారోగ్యంతో బాధపడుతూ మంచం నుంచి లేవలెని పరిస్థితిలో ఉన్నది. వైద్య ఖర్చులను, కుటుంబ పోషణకు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న విషయం తెలుసుకున్న మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత బుధవారం మోదుగు గోవిందరావు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ చిన్న సహాయం కూడా ఆపదలో ఉన్నవారికి చాలా ఉపయోగ పడుతుందని, మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి మోదుగు గోవిందరావుకు సహాయం చేయాలని కోరారు. అనంతరం ప్రజా కళాకారుడు మోదుగు గోవిందరావు అమ్మ పాట పాడి మార్పు స్వచ్చంధ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్పు స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు గుడిమెట్ల మోహనరావు, తూము సుధాకర్, బాజోజు రమణ, షేక్.మజీద్, మహ్మద్ రఫీ, షేక్ మజీద్ బీ, షేక్ షైనాబీ, షేక్ రెహానా, గ్రామస్తులు పాల్గొన్నారు.









