వేలేరుపాడుకు కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం; కూలీలకు ఆధునిక పనిముట్లు అందజేత
చదరంగం క్రీడాకారిణి భవ్యశ్రీకి సాయం, గుమ్మడవల్లి కొత్తూరులో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, అక్టోబర్, 27: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం అశ్వారావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముందుగా ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలకు కొత్త పనిముట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలు తక్కువ కష్టంతో ఎక్కువ పని చేయగలిగేలా ఈ పనిముట్లు ఉపయోగపడతాయని తెలిపారు. కూలీల కష్టానికి విలువ ఇవ్వడం, వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం మా ప్రభుత్వ బాధ్యత అని స్పష్టం చేశారు. గ్రామీణాభివృద్ధిలో ఉపాధి కూలీల పాత్ర కీలకమని కొనియాడారు. అనంతరం అశ్వారావుపేట బస్టాండ్కు చేరుకున్న ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వేలేరుపాడు మండల కేంద్రానికి నూతన బస్సు సర్వీస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అవసరం ఉన్న చోట ఇలాంటి సర్వీసులను మరిన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కొత్త బస్సు సర్వీస్ ప్రారంభం తర్వాత ప్రయాణికులతో కలిసి ఎమ్మెల్యే కొంతదూరం ప్రయాణించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల కేంద్రంలో కేశిబోయిన వీరాంజనేయులు, రమాదేవి దంపతుల కుమార్తె భవ్యశ్రీ చదరంగంలో జాతీయ స్థాయికి ఎంపికైన సందర్భంగా ఆమెను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. భవ్యశ్రీని మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. చివరగా గుమ్మడవల్లి కొత్తూరు గ్రామంలో ఇటీవల ఐటీడీఏ పరిధిలో అశ్వారావుపేట నియోజకవర్గానికి అదనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ భూమి పూజ చేసి, పనులను ప్రారంభించారు. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ యాజమాన్యం ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.









