మణుగూరు దాడిపై దమ్మపేట బిఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం -నిరసనకారులను అదుపులోకి తీసుకున్న దమ్మపేట పోలీసులు
మాజీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నిరసన చేపట్టిన బిఆర్ఎస్ శ్రేణులు -మందలపల్లి నుండి పోలీస్ స్టేషన్కు తరలింపు.
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్, 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు దమ్మపేట మండలంలో బిఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మణుగూరులో పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన కాంగ్రెస్ నాయకుల అరాచక వైఖరిని నిరసిస్తూ, దమ్మపేట మండలం మందలపల్లిలో బి.ఆర్.ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. నిరసన ఉధృతం అవుతున్న తరుణంలో, శాంతిభద్రతల దృష్ట్యా దమ్మపేట పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిరసనకారులను అదుపులోకి తీసుకుని, వారిని దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో బిఆర్ఎస్ స్థానిక నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ప్రశ్నించే హక్కు లేకుండా బిఆర్ఎస్ కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని అన్నారు. జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు రేగ కాంతారావు పోరాటాన్ని తట్టుకోలేకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బి.ఆర్.ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు పునరావృతమైతే, భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని వారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.









