జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు.. కాంగ్రెస్ బేజారు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు మీదుంది.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వినూత్న ప్రచార శైలితో దూసుకుపోతుంది.
అధికార కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టేందుకు ఎన్ని రకాల ఎత్తులు వేయాలో అన్ని వేస్తోంది.
ప్రత్యర్థికి అంతుచిక్కని వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్లడంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సఫలీకృతుడయ్యాడు.
బీఆర్ఎస్ ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ వరుసగా చిత్తవుతోంది.. బాకీ కార్డుల నుండి మొదలుకొని రోడ్ షోల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ మోసాలను, హైడ్రా బాధితుల దుఃఖాన్ని ప్రజలు చూపించడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది.
ప్రజా సమస్యలనే ఎజెండా తీసుకొని.. ఒక రోజు బస్తీ దవాఖానాలు, మరో ఆటోడ్రైవర్ల సమస్యలు, ఇంకో రోజు నిరుద్యోగుల కష్టాలు, మరో రోజు పెంచిన బస్ ఛార్జీల మీద నిరసనలు నిర్వహించింది.
ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే.. ఇంకో వైపు వివిధ పార్టీల నుండి బీఆర్ఎస్లోకి చేరికలను దగ్గరుండి చూసుకుంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ చెమటలు పట్టిస్తున్నాడు.
దీనికి తోడు మూడు భాషల్లో తన పదునైన ప్రసంగాలతో రోడ్ షోలకు వస్తున్న ప్రజలను, బీఆర్ఎస్ శ్రేణులను ఉత్తేజపరుస్తున్నాడు.
రెండేళ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపుతూ.. బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేయాలో జూబ్లీహిల్స్ ప్రజలకు వివరిస్తున్నాడు.
బీఆర్ఎస్ ప్రచార శైలి చూసి కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టడం లేదు. ప్రతిపక్ష పార్టీకి ఎలా చెక్ పెట్టాలని కాంగ్రెస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.
అందుకే ఇటీవల జరిగిన సమావేశంలో.. పాలన పక్కకు పెట్టి మరీ ఎన్నికల ప్రచారంలో మంత్రులు చురుగ్గా పాల్గొనాలని రేవంత్ కోరాడు.
కానీ బీఆర్ఎస్ రాష్ట్ర నేతలంతా జూబ్లీహిల్స్లో వాలిపోయి ప్రచారం చేస్తుంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం ప్రచారానికి ఆసక్తి కనబరచడంలేరు.
ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం మొహం చాటేస్తున్నారు.
మంత్రులే కాంగ్రెస్ను దగ్గరుండి ఓడిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది.
ప్రచారంలో కీలకంగా వ్యవహరించాల్సిన మంత్రులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే.. కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడుతుందని సామాన్యులు జోస్యం చెబుతున్నారు.
జూబ్లీహిల్స్లో ఈజీగా గెలవొచ్చని లెక్కలు వేసుకుంటే.. డామిట్ కథ అడ్డం తిరిగిందని కాంగ్రెస్ నేతలు లోలోపల కుమిలిపోతున్నారు.









