అమరవీరుల సంస్మరణ సభలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్లో 50 కుటుంబాల చేరిక
దమ్మపేటలో సీపీఐ, ఇతర పార్టీల నుంచి భారీ చేరికలు; హామీలను అమలు చేయాలని డిమాండ్
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, నవంబర్ 5, 2025: దమ్మపేట మండలంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా సుధాపల్లి, పాత చీపురుగూడెం, లంకలపల్లి, ఎర్రగుంపు గ్రామాలకు చెందిన కూరం ప్రసాద్, కొరస వెంకటేశ్వరావు, కొరస నాగమణి, సోడం వెంకటేశ్వరరావు, వగ్గేల రాజులు, పొట్ట నాగేశ్వరావు, వగెల ప్రసాద్, సోడెం నాగేశ్వరరావు, వగెల నరేష్ నాయకత్వంలో వివిధ పార్టీల నుంచి, ముఖ్యంగా సీపీఐ నుంచి 50 కుటుంబాల వారు సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీలో చేరారు. వీరందరికీ పార్టీ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం, డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తోడం దుర్గమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి ముద్ద భిక్షం మాట్లాడుతూ.. వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజల కోసం పోరాడి ఎందరో ప్రాణాలర్పించారని అన్నారు. భారతదేశంలో వర్గ పీడన, దోపిడీ, కుల వ్యవస్థ, మతాలు, మూఢనమ్మకాలు వంటి అసమానతలు పోవాలని రాయల సుభాష్ చంద్రబోస్, డివి కృష్ణ, ఏనుగు అప్పయ్య వంటి అమరవీరులు పోరాడారని గుర్తుచేశారు. ఈ అమరవీరుల వారసత్వాన్ని కొనసాగించడమే వారికి నిజమైన నివాళి అని అన్నారు. 1976 ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీ ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్ల పేరిట ఎంతోమంది నాయకులను హత్య చేసిందని ఆయన ఖండించారు. ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ ప్రజా పోరాటాలకు ఆకర్షితులై వీరందరూ పార్టీలో చేరడం జరిగిందని, వారి సమస్యల కోసం నిరంతరం ప్రజా ఉద్యమాలు ఉధృతం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అర్హులైన అందరికీ అమలు చేయాలని, ఇందిరమ్మ ఇళ్లను పేదలందరికీ ఇవ్వాలని, ఇళ్ల స్థలాలు లేని వారికి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. పార్టీలో చేరిన వారందరూ పార్టీ కుటుంబ సభ్యులు అని, ఎలాంటి కష్టం వచ్చినా పార్టీ వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నియంతృత్వ పాలక పార్టీల విధివిధానాలు నచ్చక వచ్చిన పేద ప్రజలకు విప్లవ పార్టీ అండగా ఉంటుందని, ఈ ప్రాంతంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో పాలక పార్టీలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై మాస్ లైన్ అనేక పోరాటాలు చేస్తుందని ముద్ద భిక్షం తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి గోకినపల్లి ప్రభాకర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అమర్లపూడి రాము, తోడం దుర్గమ్మ, కురసం ముత్యాలరావు, పండూరి వీరబాబు, తామ రాముడు, కుంజ కాంతారావు, కేసరి వెంకటేష్, కొండ్రు లక్ష్మి, గంగాధర నాగమణి తదితరులు పాల్గొన్నారు.









