దద్దరిల్లిన అశ్వారావుపేట -ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన బీఆర్ఎస్ నాయకులు -అభివృద్ధి గాలికి వదిలేసిన కాంగ్రెస్పై మెచ్చా నాగేశ్వరరావు ఉగ్రరూపం!
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట
నవంబర్, 07: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు పిలుపుమేరకు, శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు ఐదు మండలాల బీఆర్ఎస్ నాయకులతో కలిసి అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ అశ్వారావుపేట నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులు నరకానికి మార్గాలుగా మారాయని, ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, శాసనసభ్యులకు కనీసం చీమకుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. డిఎంఎఫ్టి, సీఎస్ఆర్ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. ప్రజా సంక్షేమం కోసం నిలబడేవారు లేరని, కేవలం నిలబడే (సిట్/స్టాండ్) శాసనసభ్యులు మాత్రమే ఉన్నారని విమర్శించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లు తప్ప కొత్తగా ఒక్క దారి కూడా వేయలేదని, వేయకపోగా గుంతలు పడ్డ రోడ్లకు సైతం మరమ్మతులు చేసే దిక్కు లేదని ఆరోపించారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో 23 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ పనులు మంజూరు చేసి మొదలు పెడితే, రెండేళ్లు దాటినా ఆ పనులను పూర్తి చేయకపోవడంతో అశ్వారావుపేటలో నివసించే ప్రజలు, వ్యాపారస్తులు మరియు పట్టణానికి వచ్చే అనేకమంది నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వాహనాలు వెళ్ళే క్రమంలో ఆ రాళ్ళు ఎగిరివచ్చి అద్దాలపై పడి పగిలే పరిస్థితి ఉన్నా కనీసం కన్నెత్తి చూసిన నాథుడు లేడని అన్నారు. గిరిజన గ్రామాల్లో మంచి నీరు రావడం లేదని, వీధి దీపాలు వెలగడం లేదని, చెత్త తరలించే బండి (ట్రాక్టర్) రావడం లేదని, దేవుడా అని వేడుకున్నా పట్టించుకోవడం లేదని మహిళలు రోడ్డెక్కి తమ బాధను నిరసన రూపంలో తెలియజేస్తున్నారని వివరించారు. నన్ను గెలిపించకపోయినా నాకే బాధ వేసి వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరానని, కానీ గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి ఇంకెవరినో గెలిపించాలని జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో శాసనసభ్యులు అందరూ హడావుడి చేయడం విచిత్రంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. మణుగూరులో పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి హేయమైన చర్య అని, ఏదైనా ఉంటే న్యాయస్థానం ద్వారా చూసుకోవాలి కానీ ఇలాంటి గూండా రాజకీయాలు (రౌడీ రాజకీయాలు) చేయడం ఏంటని మండిపడ్డారు. రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ సృష్టిస్తుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రావాల్సిన నిధులు వచ్చే దాకా, నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులపై ఉన్న గుంతలను పూడ్చే వరకు, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై మొదలైన పనులను వెంటనే పూర్తి చేసే వరకు ఈ పోరాటం ఆపేది లేదని మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









