సంక్షేమమే లక్ష్యం: ₹5.21 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసినా ఎమ్మెల్యే జారే
సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత; పూర్తవని రోడ్ల పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే జారే హామీ
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 12: అశ్వారావుపేట మండలంలోని లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ₹5,21,500 విలువైన చెక్కులను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ నిరుపేదలు ఏ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా ముఖ్యమంత్రి సహాయనిధి రూపంలో ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ హెడ్క్వార్టర్ అయిన అశ్వారావుపేటలో సెంట్రల్ లైటింగ్ పనుల ఆలస్యంపై ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. అశ్వారావుపేట పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే కోణంలో గతంలో మంజూరైన నిధులు మరియు రూపకల్పన కాకుండా, కొత్తగా అధునాతనంగా పనులు చేపట్టాలని భావించడం వల్ల కొంత జాప్యం జరిగిందని తెలిపారు. గతంలో కేవలం కోటి రూపాయలతో ఉన్న సెంట్రల్ లైటింగ్ షిఫ్టింగ్ పనులు నాణ్యతగా ఉండవని భావించి, వాటిని మెరుగుపరచడానికి రూ.9 కోట్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఆ నిధులు రావడానికి ఆలస్యం అయిందని స్పష్టం చేశారు. రద్దీగా ఉండే ఈ ప్రాంతంలోని సెంట్రల్ లైటింగ్ను మరి కొద్దిరోజుల్లో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే గత ప్రభుత్వంలో మంజూరై పూర్తికాని తాటి సుబ్బన్నగూడెం, మొద్దులగూడెం రోడ్ల పనులను తమ ప్రభుత్వంలో పూర్తిచేస్తామని, ప్రతి చోటా అనుసంధానం చేస్తూ రోడ్లు, డివైడర్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. మారుమూల గ్రామాల్లో కరెంట్ ఫోర్స్, రోడ్లు, విద్య, వైద్యం వంటి సౌకర్యాలు, ప్రతి స్కూల్లో, అంగన్వాడీ కేంద్రాలలో తమ ప్రభుత్వం కల్పిస్తున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనించాలని కోరారు. కరెంటు లేని ప్రాంతాల్లో కరెంటు ఇచ్చామని, నిరుపేదలకు ఇందిరమ్మ పథకం ద్వారా రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. గతంలో పది సంవత్సరాలు రేషన్ కార్డులు లేక పేద ప్రజలు పడిన ఇబ్బందులను తమ ప్రభుత్వం తొలగించిందని, కేవలం ఒకటిన్నర సంవత్సరంలోనే ఎన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ. రామకృష్ణ, అశ్వారావుపేట నియోజకవర్గ నాయకులు జూపల్లి రమేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మ రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ సుకవల్లి వీరభద్రరావు, మండల నాయకులు ప్రమోద్, మిండ హరిబాబు, అప్పలరాజు, తగరం మూతయ్య, మణికంఠ మొదలైన తదితరులు పాల్గొన్నారు.









