వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. కార్యాలయంలో జరుగుతున్న అవకతవకలు, అక్రమ చెలామణీలపై పలువురు చేసిన ఫిర్యాదులు ఈ దాడులకు కారణమయ్యాయి. ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం దాడులను జరిపి పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుంది.
• సబ్ రిజిస్టర్ కార్యాలయం పై సడన్ రైట్స్.
వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై పలు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఏసీబీ బృందం ముందుగా ఆ కార్యాలయానికి అనుసంధానంగా పనిచేస్తున్న డాక్యుమెంట్ రైటర్ల కేంద్రాలపై దాడులు ప్రారంభించింది. ప్రతి డాక్యుమెంట్ రైటర్ ఆఫీసులో రికార్డులు, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి, అనుమానాస్పద అంశాలను నమోదు చేసింది.
* డాక్యుమెంట్ రైటర్ల వద్ద తనిఖీలు ..మొబైల్స్, రికార్డుల స్వాధీనం
దాడుల సమయంలో ఏసీబీ సిబ్బంది డాక్యుమెంట్ రైటర్ల మొబైల్ ఫోన్లు, కార్యాలయాల్లోని పత్రాలు, సిబ్బంది వ్యక్తిగత ఫోన్లను సీజ్ చేశారు. ముఖ్యంగా నగదు బదిలీ యాప్లు, బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అబధ్ధాలు, అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏసీబీ వర్గాలు సూచిస్తున్నాయి.
* సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద రూ. 2.90 లక్షల స్వాధీనం
దాడుల్లో ఓ సీనియర్ డాక్యుమెంట్ రైటర్ వద్ద సుమారు రెండు లక్షల తొంభై వేల రూపాయల నగదు లభించింది. సదరు డాక్యుమెంట్ రైటర్ ఆ నగదు తనకు అప్పు ఇచ్చిన వ్యక్తికి తిరిగి ఇవ్వడానికి తీసుకువచ్చినదేనని ఏసీబీ అధికారులకు వెల్లడించినట్లు సమాచారం. నగదు మూలానికి సంబంధించిన ఆధారాలను కూడా చూపించినట్టు తెలిసింది. అయినప్పటికీ, ఏసీబీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతోంది.
* రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పరిశీలన ..ఏసీపీ రమేష్ వివరణ
ఏసీబీ ఏసీపీ రమేష్ మాట్లాడుతూ, వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వరుస ఫిర్యాదులు రావడంతో దాడులు నిర్వహించామని తెలిపారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ అయిన అన్ని డాక్యుమెంట్లను డాక్యుమెంట్ రైటర్లు ఎలా తయారు చేశారో, ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరిగిందో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. కార్యాలయ సిబ్బంది ఫోన్లలోని నగదు లావాదేవీల యాప్లు, సందేశాలు, కాల్ వివరాలను కూడా చెక్ చేస్తున్నట్లు వెల్లడించారు.
* లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు డబ్బు, వస్తువులు లేదా సేవల రూపంలో లంచం కోరితే వెంటనే నంబర్ 1064 కు ఫోన్ చేయాలని ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఈ నంబరు 24 గంటలు పనిచేస్తుందని అధికారులుఅన్నారు. ఏసీబీ దాడులు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.
🔸 ఏసీబీ దాడులతో వైరాలో అలజడి
ఈ అకస్మిక దాడుల కారణంగా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో, ముఖ్యంగా డాక్యుమెంట్ రైటర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. అక్రమాలు వెలుగులోకి వచ్చే భయంతో పలు మంది డాక్యుమెంట్ రైటర్లు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సమాచారం.









