అశ్వారావుపేట అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలి: ఎమ్మెల్యే జారే
భద్రాచలంలో జిల్లా రివ్యూ సమావేశం; నియోజకవర్గ సమస్యలు వివరించిన జారే ఆదినారాయణ.
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధికి సంబంధించి సమన్వయ పరిశీలన కమిటీ సమావేశం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఖమ్మం ఎంపీ రామసహాయం రాఘురామ్ రెడ్డి, మాజీ ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొన్న అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వివరించారు. గ్రామీణాభివృద్ధి, రహదారులు, విద్య, ఆరోగ్య రంగాలలో జరుగుతున్న పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ ప్రతి పథకం గ్రామస్థాయికి చేరేలా సమన్వయ చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల అవసరాలను అర్థం చేసుకొని సమస్యల పరిష్కారానికి కట్టుబడి పని చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత మరియు వేగం పెంచాలని అధికారులకు సూచించారు. విభిన్న శాఖల మధ్య సమన్వయం ద్వారా మాత్రమే అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అన్ని శాఖల అధికారుల సహకారం చాలా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.









