అర్ధరాత్రి ఇళ్లు కూల్చివేతపై ఆగ్రహం: పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటం – సీపీఐ నిరసన దీక్ష
భూస్వాములకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా? అశ్వరావుపేట తాహాసిల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆందోళన
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట మండలం తాహాసిల్దార్ కార్యాలయం ముందు ఆదివారం అర్ధరాత్రి ఇళ్లు కూల్చేసిన నిరుపేదలకు న్యాయం చేయాలంటూ సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. గత 5, 6 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో గుడిసెలు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్న పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన సుమారు 200 కుటుంబాల ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు అర్ధరాత్రి నిర్దాక్షిణ్యంగా కూల్చివేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దౌర్జన్యానికి పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగే వరకు ఈ నిరసన దీక్షను కొనసాగిస్తామని సయ్యద్ సలీం స్పష్టం చేశారు. అదేవిధంగా కెమిలాయిడ్స్, గోకరాజు రంగరాజు వంటి భూస్వాములకు అప్పగించిన వందల ఎకరాల ప్రభుత్వ భూముల సంగతి ఏమిటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒక్క పేదల గుడిసెల తొలగింపుకే అధికారులు ఉత్సాహం చూపిస్తున్నారని, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న బడాబాబులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా నాయకులు బుడితి చిరంజీవి, తుడుం దెబ్బ జిల్లా నాయకులు తంబళ్ల రవి సంఘీభావం తెలియజేశారు. ఈ పోరాటంలో సీపీఐతో కలిసి తాము కూడా ప్రయాణం చేస్తామని, బాధితులకు అండగా ఉంటామని వారు ప్రకటించారు. ఈ నిరసన దీక్షలో సీపీఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, దౌర్జన్యంగా ఇళ్లు కోల్పోయిన పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









