గుడిసెలు కోల్పోయిన పేదలకు పునరావాసం కల్పించాలి: తుడుం దెబ్బ డిమాండ్
అశ్వరావుపేటలో గుడిసెలు కోల్పోయిన బాధితులను పరామర్శించిన తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, నవంబర్, 18: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేటలో ఇటీవల ప్రభుత్వ అధికారులు తొలగించిన గుడిసెలు కోల్పోయిన బాధితులను తుడుం దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తంబళ్ల రవి మంగళవారం పరామర్శించారు. సుమారు నాలుగేళ్ల క్రితం ఇళ్లు లేని నిరుపేదలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించి, బాధితుల నుంచి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుడుం దెబ్బ నాయకులు మాట్లాడుతూ, నిరుపేదల పొట్టగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని అధికారులను ప్రశ్నించారు. ఎంతో ఇష్టపడి కాంగ్రెస్కి ఓటు వేసి గెలిపిస్తే నేడు పేదలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనట్లు పలు పత్రికల్లో ప్రచురించినా రెవెన్యూ అధికారులకు స్పందన లేదు కానీ పేదలు వేసుకున్న గుడిసెలను తొలగించి అధికారులు పైశాచిక ఆనందం పొందుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. తక్షణమే అధికారులు స్పందించి, ఇళ్లు కోల్పోయిన బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, అలాగే పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని తుడుం దెబ్బ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తంబళ్ల రవితో పాటు కారం రత్నా కుమారి, ఆళ్ల సుజాత తదితరులు పాల్గొన్నారు.









