వేదాంతపురంలో కొత్త వెలుగులు -గ్రామమంతా వీధిలైట్లతో పండుగ వాతావరణం
గ్రామాభివృద్ధికి పంచాయతీ ముందడుగు -కార్యదర్శి మస్తానా షేక్
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్ట్రర్: దాది చంటి) నవంబర్, 21: అశ్వారావుపేట మండలం, వేదాంతపురం గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమైన అడుగు వేసింది. గ్రామంలోని ప్రధాన వీధులు, సెంటర్ ప్రాంతాలు, కాలనీల్లో రాత్రివేళల్లో వెలుతురును అందించేలా వీధిలైట్ల ఏర్పాటు పనులు విజయవంతంగా పూర్తి చేసినట్టు పంచాయతీ కార్యదర్శి మస్తానా షేక్ తెలిపారు. గ్రామ ప్రజల భద్రత, రాత్రి వేళల్లో రాకపోకలు సురక్షితంగా ఉండేలా వీధిలైట్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ లైట్లతో ఇంతవరకు చీకటిగా, ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాలు కూడా పూర్తిగా వెలుగుతో కళకళలాడుతున్నాయి. దీనివల్ల రాత్రి సమయాల్లో ప్రమాదాలు తగ్గే అవకాశముందని, గ్రామంలో భద్రతా పరిస్థితులు మెరుగుపడతాయని పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. గ్రామ సమస్యలను పరిష్కరించేందుకు ప్రజల సూచనలు తీసుకుంటూ, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని కార్యదర్శి తెలిపారు. పంచాయతీ తీసుకున్న ఈ చొరవపై గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, పంచాయతీ శ్రద్ధను అభినందించారు. గ్రామం సమగ్ర పురోగతి సాధించే దిశగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని కార్యదర్శి మస్తానా షేక్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.









