భీకర ప్రమాదం -జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టాటా ఏసీ… ఇద్దరికి తీవ్ర గాయాలు
దమ్మపేట మండలం ముష్టిబండ వద్ద ఘటన. ఏసీ వాహనం నుజ్జునుజ్జు, కరెంట్ స్తంభం ధ్వంసం. డ్రైవర్ల నిర్లక్ష్యంపై ప్రాథమిక అంచనా.
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్ట్రర్:దాది చంటి) నవంబర్, 21: దమ్మపేట మండలం ముష్టిబండ ప్రాంతంలో జాతీయ రహదారి రక్తసిక్తమైంది. ఇక్కడ జరిగిన భయంకరమైన రోడ్డు ప్రమాదంలో టాటా ఏసీ వాహనం పూర్తిగా ధ్వంసమైంది, ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అశ్వరావుపేట నుండి సత్తుపల్లికి వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ముష్టిబండ అంతర్గత రహదారి నుండి ప్రధాన జాతీయ రహదారిపైకి వస్తుండగా, వడ్లగూడెం వైపు నుండి అతి వేగంగా వచ్చిన టాటా ఏసీ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ గుద్దుడు తీవ్రతకు టాటా ఏసీ ఎగిరిపడి, పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో టాటా ఏసీ వాహనం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, బస్సు కొంతమేర దెబ్బతింది. కరెంట్ స్తంభం కూలిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఏసీ వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులకు కాళ్లు, చేతులు విరిగిపోయి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు ఖాళీగా ఉండటం అందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన ప్రాంతం జాతీయ రహదారి కావడంతో, రోడ్డుకు అడ్డంగా వాహనాలు నిలిచిపోయి భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. టాటా ఏసీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.









