గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేసిన కాంగ్రెస్.
కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
కోర్టు మొట్టికాయ వల్లే ఎన్నికలు.
పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
పంచాయతీల బలోపేతానికి బీజేపీకే పట్టం కట్టండి.
బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.
నేటి గదర్ న్యూస్,వైరా/ కొణి జర్ల :
గ్రామ పంచాయతీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా వాటిని నిర్వీర్యం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని కుంటుబడేలా చేసిందని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క ఈ వైఖరిపై ప్రజలు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
శనివారం నాడు కొణిజర్ల మండల కేంద్రంలో బీజేపీ వైరా అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయుడు రాఘవరావు అధ్యక్షతన, జిల్లా ఉపాధ్యక్షులు బండారు నరేష్ స్వగృహంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకాలం గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించకుండా గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఎన్నికలు లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల నిధులు మురిగిపోయాయని, తద్వారా గ్రామాలలో పరిపాలన పూర్తిగా కుంటుపడిందని ఆయన దుయ్యబట్టారు. ఈరోజు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం ముందుకు రావడం కేవలం కోర్టు మొట్టికాయ వేయడంతోనే తప్ప, గ్రామాల అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంచాయతీ ఎన్నికల్లో చెంపపెట్టుగా వ్యతిరేక తీర్పు ఇవ్వాలని కోటేశ్వరరావు కోరారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుంచి, మహాత్మా గాంధీ చెప్పినట్లు గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలనే విషయాన్ని నమ్మి, వాటిని పటిష్టం చేసేందుకు నిధులను పెద్ద ఎత్తున మంజూరు చేస్తోందని, ఆ నిధులు నేరుగా గ్రామ పంచాయతీ ఎకౌంట్లలో జమ అవుతున్నాయని ఆయన వివరించారు. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించి, కేంద్రం నిధులను సక్రమంగా వినియోగించుకుని, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను పంచాయతీ ఎన్నికల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గ్రామ పంచాయతీలలో గెలవబోతున్నారని, ఆ దిశగా బీజేపీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి సైదేశ్వర రావు, సీనియర్ నాయకులు సుబ్బారావు, రమేష్ , కార్తీక్, రామారావు , మండలాల అధ్యక్షులు మనుబోలు వెంకటకృష్ణ , కవిడ మురళి , మేకల మల్లేష్ , బొల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.









