మహిళా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృత పర్యటన
దమ్మపేట, అన్నపురెడ్డిపల్లిలో చీరల పంపిణీ; చండ్రుగొండలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం, రూ. 47 లక్షల సీసీ రోడ్ల ప్రారంభం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) నవంబర్, 22: అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శనివారం దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా దమ్మపేట ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలకు స్వయంగా ఇందిరమ్మ చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, మహిళల ఆర్థిక స్థితి బలోపేతం కావాలనేదే ప్రభుత్వ అసలు ఉద్దేశమని, మహిళల గౌరవాన్ని ప్రతిబింబించే భావంతోనే ఈ చీరల పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. అదే రోజున అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా స్థాయి ఉన్నతాధికారులతో కలిసి మహిళలకు చీరలను అందజేశారు. అనంతరం దమ్మపేట మండలం మొండివర్రె కాలనీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పూర్తికి చేరుకున్న ఇళ్లను, ఇంకా పునాది దశలో ఉన్న ఇళ్లను పరిశీలించిన ఆయన, నిర్మాణ సమస్యలు ఏవైనా ఉన్నా త్వరితగతిన పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు. ఆ తర్వాత శ్రీరామపురం, లింగాలపల్లి, జమేదార్, బంజర, మందలపల్లి గ్రామాల్లో ఇటీవల రూ. 47 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని, అభివృద్ధి, సంక్షేమం తమ రెండు కళ్లులాంటివని, వచ్చే మూడు సంవత్సరాల్లో ప్రతి గ్రామాన్ని సమస్యలు లేని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చండ్రుగొండ మండలంలోని పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే, వెంగళరావుపాలెం గ్రామంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లలో పూర్తయిన బానోత్ అంజిత ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. లబ్ధిదారుల ఇంట్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. తరువాత తుంగారం గ్రామంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇందిరమ్మ చీరలను అందజేశారు. చివరగా, అయ్యన్నపాలెం గ్రామాన్ని సందర్శించి, అనారోగ్యంతో అకాల మరణం చెందిన వాసం గౌతమి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యపర్చారు. ఈ కార్యక్రమాలలో మద్దిశెట్టి సత్యప్రసాద్ దమ్మపేట మండల అధ్యక్షులు, మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి, మహిళా అధ్యక్షురాలు మచ్చల పార్వతి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









