మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం….. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు ఇందిరమ్మ చీర పంపిణీ.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.
మహిళలు ఆర్థికంగా బలోపేతం అయితే కుటుంబాలు బాగు పడతాయని, మహిళల ఉన్నతికి పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.
ఖమ్మం రూరల్ మండలం బైపాస రోడ్ లో టిసీవి రెడ్డి ఫంక్షన్ హాల్ లో పాలేరు నియోజకవర్గం నాలుగు మండలాల సహాయ సంఘాల మహిళలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్డర్ ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించామని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ప్రతి ఒక్కరికి చీర తప్పకుండా అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రభుత్వం తరపున ఇందిరమ్మ చీరలు ఇంటింటికి వెళ్లి అందజేయాలని అన్నారు. గ్రామాల్లో అర్హులైన అందరికి తప్పకుండా చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, ఏలాంటి లోటుపాట్లకు తావు ఇవ్వవద్దని స్పష్టం చేశారు.
పెట్రోల్ పంపు, సోలార్ విద్యుత్ ప్లాంట్, ఆర్టీసీకి అద్దె బస్సుల ఏర్పాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరమ్మ క్యాంటీన్ల ఏర్పాటు వంటి అనేక వ్యాపార అవకాశాలను మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మహిళల చేతిలో డబ్బులు ఉంటే కుటుంబ వ్యవస్థ బాగుపడుతుందని ప్రభుత్వం బలంగా విశ్వసిస్తుందని అన్నారు. జిల్లాకు ఇప్పటివరకు నియోజకవర్గాల వారిగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా ఉన్న ప్రత్యేక అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా, మండల, గ్రామ మహిళా సమాఖ్యలు, సెర్ప్ సిబ్బందిని సమన్యయం చేసుకొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలో అర్హులైన మహిళలు మొత్తం 53 వేల మందికి చీరెలు పంపిణీ సజావుగా జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు ఆఫీస్ ఇన్ చార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి మాట్లాడుతు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న వివరించారు. స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తామని తెలిపారు. పండగ వాతావరణం లో పాలేరు నియోజకవర్గం లో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పాలేరు నియోజకవర్గం లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగతికి తోడ్పుతుందని తెలిపారు.
ఒక అన్న చెల్లెకు అందించే కానుకగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అర్హులైన ప్రతి మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం రాబోవు కాలంలో మహిళల సంక్షేమం మరియు అభివృద్ధికై అధిక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సన్యాసయ్య, మద్దులపల్లి మార్కెట్ కమిటి చైర్మన్ హరినాథ్ బాబు, తహసీల్దార్లు రాంప్రసాద్, విల్సన్, వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









