డిజిటల్ అరెస్ట్ బెదిరింపులు నమ్మొద్దు: A DCP రామానుజం
*”ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” అవగాహన లో అడిషనల్ డీసీపీ
డిజిటల్గా అరెస్ట్ చేస్తామని బెదిరించి, డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్ళ మాయమాటలు నమ్మి మోసపోవద్దని అదనపు DCP (పరిపాలన) బొజ్జా రామానుజం అన్నారు.
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రారంభమైన “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన శిబిరం లో భాగంగా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యవేక్షణలో ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రంలో 150 మంది విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ..మీ వ్యక్తిగత సమాచారాన్ని, ముఖ్యంగా పాస్వర్డ్లు, బ్యాంక్ వివరాలు, OTPలను ఎవరితోనూ పంచుకోవద్దని అన్నారు.
అపరిచిత లింక్లపై క్లిక్ చేయవద్దని, ఫోన్ ద్వారా వచ్చిన అటాచ్మెంట్లను తెరవవద్దని సూచించారు.
డిజిటల్ అరెస్ట్, బెదిరింపుల గురించి భయపడవద్దని అన్నారు. డబ్బును బదిలీ చేయమని లేదా నగదు తీసుకుని ఇవ్వమని కోరే ఇటువంటి అభ్యర్థనలను విశ్వసించవద్దని పేర్కొన్నారు. మీరు ఏదైనా మోసానికి గురైనట్లు భావిస్తే, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఏసీపీ ఫణిందర్, సిఐ నరేష్ కుమార్ సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు.









