గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలే లక్ష్యం : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నేటి గదర్ న్యూస్, ఎర్రుపాలెం ఫిబ్రవరి 4: జిల్లాలోని ఎర్రుపాలెం మండల కేంద్రంలో అత్యాధునిక వైద్య వసతులతో నూతనంగా నిర్మిస్తున్న 50 పడకల హెల్త్ కమ్యూనిటీ సెంటర్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్షేత్రస్థాయిలో బుధవారం తనిఖీలు చేశారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలిస్తూ, పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకు సులభంగా, సమర్థవంతంగా వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నూతన హెల్త్ కమ్యూనిటీ సెంటర్ అందుబాటులోకి వస్తే, పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. మాతృశిశు సంరక్షణ, అత్యవసర వైద్యం, సాధారణ చికిత్సలు, ల్యాబ్ సేవలు తదితర అన్ని సదుపాయాలు ఈ కేంద్రంలో కల్పించనున్నట్లు తెలిపారు.
నిర్మాణ పనుల్లో ఎలాంటి లోపాలు లేకుండా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే, పనుల పురోగతిపై తరచూ నివేదికలు సమర్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్ గౌడ్, వైద్య శాఖ ఇ ఇ ఉమామహేశ్వర రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.









