ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలి : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్: ఖమ్మం జనరల్ ఆసుపత్రి ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తూ, ఆసుపత్రిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని ప్రజ్ఞ మీటింగ్ హాల్ లో గురువారం ఖమ్మం జనరల్ ఆసుపత్రి పని తీరు, ఆసుపత్రిలో ఉన్న పెండింగ్ అభివృద్ధి పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ఆసుపత్రి వైద్య అధికారులు, మున్సిపల్, మిషన్ భగీరథ, సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం ఆసుపత్రిలో వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండటం లేదని, ఫిర్యాదులు వస్తున్నాయని, ఈ పద్దతిలో వెంటనే మార్పు రావాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
రెండు వారాలకు ఒకసారి ఆసుపత్రి పని తీరుపై ఖమ్మం మున్సిపల్ కమీషనర్ రివ్యూ నిర్వహించాలని అన్నారు. ఆసుపత్రిలోని 10 స్పెషల్ రూమ్ మరమ్మత్తు పనులు మునిసిపల్ కార్పోరేషన్ ద్వారా చేపట్టి 15 రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఎమర్జెన్సీ సమయంలో వినియోగించేందుకు జిజిహెచ్ వద్ద 5 లక్షల రూపాయలు నిరంతరం అందుబాటులో పెడతామని, ఏ విభాగంలో నైనా వైద్య పరికరాలు, యంత్రాలు అవసరం ఉంటే, వెంటనే కొనుగోలు చేయాలని, ఆసుపత్రిలో కోటి 65 లక్షలతో చేపట్టిన టాయిలెట్స్ లను రాబోయే నెల రోజుల వ్యవధిలో 100 శాతం పూర్తి చేసి, టాయిలెట్స్ నిర్మాణంతో పాటు వాటి నిర్వహణకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆసుపత్రిలో ఆర్.ఎం.ఓ. లను నియమించి పాలన వ్యవహారాలు వారికి అప్పగించాలని కలెక్టర్ సూచించారు. ఎం.సి.హెచ్. లోని సీవర్ లైన్స్, టాయిలెట్స్ పనులు ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని కలెక్టర్ తెలిపారు.
ఓపి రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక బ్లాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఓపి కోసం 3 డేటా ఎంట్రీ ఆపరేటర్ లను తాత్కాలిక ప్రాతిపదికన నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో లిఫ్ట్ మరమ్మత్తు పనులు పూర్తి కాకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి, 7 రోజుల్లో లిఫ్ట్ పని చేయాలన్నారు. ఆసుపత్రి అవసరాల కోసం ప్రస్తుత వాటర్ సంప్ సరిపోవడం లేదని, మరో 200 కేఎల్ సామర్థ్యంతో కూడిన సంప్ నిర్మించాలని అన్నారు. వర్షా కాలం ముందే ఆసుపత్రి భవనం నుండి ఎక్కడా వాటర్ లీకేజి కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ఎస్.టీ.పి. పెండింగ్ నిర్మాణ పనులను మరొక కాంట్రాక్టర్ తో చేపట్టి మార్చి 15 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆసుపత్రిలో అవసరమైన ఫైర్ సేఫ్టీ పనులు, సిసి కెమెరాల ఏర్పాటు మార్చి 15 నాటికి ఏర్పాటు చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ కు సూచించారు. ఆసుపత్రి వద్ద రోడ్డు పై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, అవసరమైన భద్రత ఏర్పాట్లు ఉండాలన్నారు. ఆసుపత్రిలో అవసరమైన అంతర్గత రోడ్లు, ఫుట్ పాత్ తో సహా నిర్మాణ పనులు చేపట్టి నెలాఖరు వరకు పూర్తి చేయాలని అన్నారు. నెలకు 55 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఆసుపత్రిలో ఆశించిన స్థాయిలో పారిశుద్ధ్యం ఉండటం లేదని కలెక్టర్ అన్నారు. పారిశుద్ధ్య పని తీరు సరిగ్గా లేదంటూ సంబంధిత ఏజెన్సీలకు నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పారిశుద్ద్యం పని తీరు ఇంప్రూవ్ కాని పక్షంలో సదరు ఏజెన్సీ రద్దు చేయాలని డీఎంఈకు లేఖ రాయాలని అన్నారు.
ఆసుపత్రిలో ఎఫ్.ఆర్.ఎస్. విధానంలో పారిశుద్ధ్య సిబ్బంది హాజరు నమోదయ్యేలా వ్యవస్థ ఏర్పాటు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎఫ్.ఆర్.ఎస్. హాజరు రిపోర్ట్ ఆధారంగా పారిశుద్ధ్య సిబ్బందికి సంబంధించి జీతాలు చెల్లింపు చేయాలని అన్నారు. బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.
ఫిబ్రవరి 11 నాటికి బయో మెడికల్ ఇంజనీర్ తాత్కాలికంగా నియామకం చేపట్టాలని, ఆసుపత్రి కోసం అవసరమైన సామాగ్రి కొనుగోలుకు అందించిన ప్రతిపాదనలు ఫాలో అప్ చేస్తూ త్వరగా ఆసుపత్రికి చేరేలా చూడాలని, టిఫ్ఫా స్కానింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
గత 3 నెలలుగా జనరల్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. అత్యంత క్లిష్టమైన హై రిస్క్ కేసులను గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసిన తర్వాత ఆ కేసులను ఫాలో అప్ చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, మునిసిపల్ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, వివిధ విభాగాల వైద్య అధికారులు, మిషన్ భగీరథ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.









